చపాతీలను తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయొజనాలు ఉన్నాయో అందరికి తెలుసు.వివిధ రకాల ఇతర ధాన్యాలన్నింటితోనూ చపాతీలను చేసుకుని తింటే ఇంకా మెరుగైన ఫలితాలు లభిస్తాయి. పలు భిన్నరకాల ధాన్యాలతో తయారు చేసిన చపాతీలను తినడం వల్ల వాటిల్లోని పోషకాలన్నింటినీ పొందవచ్చు. దీంతో ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. మరి ఆ చపాతీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పొట్టు తీయని గోధుమ పిండి 2 కిలోలు, శనగ పప్పు 100 గ్రాములు, మొక్కజొన్న లేదా జొన్నలు 100 గ్రాములు, సజ్జలు 50 గ్రాములు, బార్లీ 50 గ్రాములు, రాగులు 50 గ్రాములు, సోయాబీన్ 50 గ్రాములు, ఓట్స్ 100 గ్రాములు తీసుకోవాలి. అన్ని ధాన్యాలను పొట్టు తీయనివే తీసుకుంటే మంచిది.గోధుమలు తప్ప అన్ని ధాన్యాలను కొద్దిగా వేయించాలి. తరువాత చల్లారాక అన్నింటినీ గోధుమలతో కలిపి పిండిగా పట్టించాలి. అలా పట్టించిన పిండిని కొద్దిగా ఆరనివ్వాలి.
అనంతరం దాన్ని ఓ డబ్బాలో నిల్వ చేసుకోవాలి.ఇక పై విధంగా తయారు చేసుకున్న పిండిని కావల్సినంత తీసుకుని అందులో కొత్తిమీర, పుదీనా ఆకులు, నీళ్లు వేసి కలుపుకోవాలి. తరువాత ముద్దలుగా చేసి చపాతీలను తయారు చేయాలి. వాటిని పెనంపై కాల్చి వేడిగా ఉండగానే తినేయాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నెయ్యి లేదా వెన్నను వాడవచ్చు. దీంతో చపాతీలు ఇంకా రుచిగా ఉంటాయి.. ఆరోగ్యానికి చాలా మంచిది.. మీరు కూడా ఒకసారి ట్రై చెయ్యండి.